టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను గన్నవరం కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదైన కేసులో పట్టాభిని గన్నవరం కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి సంబంధం లేని పట్టాభి గన్నవరం రావడం వెనుక కుట్ర కోణంపై అనుమానం ఉందని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు.
మరో కేసులో కూడా పట్టాభి నిందితుడిగా ఉండటంతో కోర్టులో హజరుపరచాల్సి ఉందని తెలిపారు. రెండు రోజుల పాటు పట్టాభిని కస్టడీ ఇవ్వాలని గన్నవరం పోలీసులు పిటిషన్ లో కోరారు. అయితే అట్రాసిటీ కేసుల విషయంలో కస్టడీ అంశం తమ పరిధిలో లేదని పేర్కొన్న న్యాయమూర్తి.. విజయవాడలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసులకు సూచించారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.