Ganta Srinivas Rao : గంటా శ్రీనివాసరావు .. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన ఓ రకమైన విశ్లేషణతో వార్తల్లోకి ఎక్కితే గత పదిమేను రోజులుగా ఇంకో రకమైన పరిణామంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీ ప్రజల గుర్తింపునకు కేంద్రంగా నిలిచిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన నేపథ్యంలో అన్ని వర్గాలు తమదైన శైలిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. దానికి కొనసాగింపుగా మరిన్ని పరిణామాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా Ganta Srinivas Rao ఏం చేస్తున్నారంటే…
గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే సంగతి తెలిసిందే. కానీ ఆ పార్టీ కార్యకలాపాల్లో ఆయన క్రియాశీలంగా పాల్గొనడం లేదు. కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. తాజాగా స్టీల్ ప్లాంట్ అంశంపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 100 శాతం స్టీల్ ప్లాంట్ విక్రయిస్తున్నామని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారని.. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగానే ఆర్ధిక మంత్రి స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. పోస్కో, NMDC,RINLమధ్య వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందని ఉక్కు మంత్రిత్వశాఖ మంత్రి రాతపూర్వకంగానే చెప్పారని తెలిపారు. ప్రయివేటీకరణ విధానంతో పాటు మానవత్వం ఉండాలని.. ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగుల భద్రత, ప్లాంట్ భవిష్యత్తు ఎవరి చేతుల్లోనూ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ గురించి కూడా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని… జనం ఆందోళనలో ఉంటే బీజేపీ కొత్త పల్లవి అందుకుందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. బీజేపీ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడ్డంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాన్ కు ఎక్కువ బాధ్యత, హక్కు ఉందని… పవన్ కళ్యాణ్ నేరుగా పోరాటం ప్రకటించాలి… స్టీల్ ప్లాంట్ ను రక్షించేందుకు సిద్ధపడాలని కోరారు. తన రాజీనామాపై నిర్ణయం స్పీకర్ చేతుల్లో ఉందన్నారు. కాగా, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాస్తే కృతజ్ఞతలు తెలిపిన గంటా శ్రీనివాసరావు … టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానికి రాసిన లేఖపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.