Ganta Srinivasarao : విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం అవుతున్నది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పాటు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని రాజకీయాలకు అతీతంగా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు విశాఖ ఉక్కును అప్పగిస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధమవుతామని వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. విశాఖలో నగరంలోని మద్దెలపాలెం కూడలిలో శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారాకో చేపట్టాయి.
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనేందుకు వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలకు సిద్ధం కావాలంటూ పిలుపు నిచ్చిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ కు పంపారు.. అయితే గంటా శ్రీనివాసరావు తన రాజీనామలో ఒక కండీషన్ పెట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు సంబంధించి కేంద్ర నిర్ణయం అమల్లోకి రాగానే తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ ను కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు గంటా ప్రకటించారు. విశాఖ స్టీల్ కర్మగారం ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు.