Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. విశాఖపట్నం పాయకరావుపేట నియోజకవర్గం గుంటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు హజరైయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. వాస్తవానికి కాపులు ఏ రాజకీయ పార్టీకి కాపు కాస్తే ఆ రాజకీయ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనేది అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ టీడీపీకి దూరం అయ్యింది. అయితే జనసేనకు మద్దతు ఇస్తే మళ్లీ పవన్ కళ్యాణ్ టీడీపీకే సహకరిస్తారని ప్రచారం జరగడంతో మెజార్టీ కాపు సామాజిక వర్గ నేతలు 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపు కాశారు. అయితే గత కొంత కాలంగా రాజకీయాలకు అతీతంగా కాపు సామాజిక వర్గ నేతలు సంఘటితం అవుతున్నారు. సమావేశాల్లో పాల్గొంటున్నారు.
Ganta Srinivasa Rao: కాపు సామాజిక వర్గమే రాజకీయాలను శాసిస్తుంది
నిన్న వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలోనూ రాజకీయాలకు అతీతంగా ఆ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు. జనసేన నాయకుడు బుజ్జి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి గంటాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ధర్మశ్రీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాజకీయాలు వేరైనా సామాజిక వర్గ సమస్యల విషయంలో సంఘటితంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గమే రాజకీయాలను శాసిస్తుంది వ్యాఖ్యానించారు. ఏపిలో రాబోయే రోజుల్లో కాపులు ఏకమవ్వాలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాపులే కీలకం కానున్నారని గంటా అన్నారు. కాపుల బలోపేతానికి ఎప్పుడూ కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా అన్నారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల కాపు నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని వార్తలు వచ్చాయి. దివంగత వంగవీటి మోహనరంగా పేద వర్గాల కోసం కృషిని కొనియాడిన ఎమ్మెల్యే ధర్మశ్రీ … ఏపిలో రెండు లక్షలకు పైగా వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఉన్నాయన్నారు. దేశంలో అంబేద్కర్ విక్రయాల తరువాత ఆ స్థాయిలో విగ్రహాలు ఉన్నాయి అంటే అవి కేవలం వంగవీటి మోహనరాంగా విగ్రహాలే అని కరణం ధర్మశ్రీ వ్యాఖ్యానించారు.
ఒక కులంతో రాజకీయం చేద్దామంటే సాధ్యం కాదు
కాగా గంటా వ్యాఖ్యలకు భిన్నంగా తోట త్రిమూర్తులు మాట్లాడారు. సామాజిక వర్గ సమస్య ఏదైనా వస్తే అందరం కలిసి పని చేయాలన్నది తమ ఉద్దేశమన్నారు. “పార్టీలు వేరు,. కులం వేరు. రాజకీయ పార్టీలో మాకు నచ్చిన పార్టీలో మా అవసరాల కోసమో లేకపోతే మాకు నచ్చిన పార్టీ సిద్ధాంతాల కోసం ఏ పార్టీలోనైనా ఉంటాం. కానీ సామాజికవర్గానికి సంబందించిన సమస్య ఏదైనా వస్తే అందరం కలిసి పని చేయాలనే” తాను చెప్పాను. ఒక కులంతో రాజకీయం చేద్దామంటే ఎప్పుడూ సాధ్యం కాదు. దీనికి గత అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సామాజికవర్గం కోసం పని చేయకుండా ఓట్ల కోసమే వచ్చే వాళ్లను గుర్తించరు అని ఆయన వ్యాఖ్యానించారు.