తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అయిదవ రోజు శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామి వారు తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. మొత్తం గ్యాలరీల వద్ద స్వామి వారిని అటు ఇటు తిప్పుతూ భక్తులకు గరుడ వాహనాదీశుడైన శ్రీ మలయప్ప స్వామి దర్శనభాగ్యం కల్పించారు. ప్రభుత్వం తరపున ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమర్పించిన పట్టువస్త్రాలను స్వామి వారికి నేడు అలంకరించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల నమ్మిక.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఆరో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజవాహనంపై శ్రీవారు భక్తులను దర్శనమిస్తారు. శనివారం జరిగిన కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఇఓ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?