Breaking: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఏపీసీసీ నూతన ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా జంగా గౌతమ్, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిని నియమించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్ గా జివి హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా డాక్టర్ ఎన్ తులసిరెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నియామక ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. కో ఆర్డినేషన్ కమిటీలో అనుబంధ సంఘాల అద్యక్షులకు స్థానం కల్పించారు. ఇప్పటి వరకూ ఏపీసీసీ చైర్మన్ గా సాకే శైలజానాథ్ వ్యవహరించారు.
విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం వైసీపీకి మళ్లింది. 90 శాతం పైగా నేతలు వైసీపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని సైతం కైవశం చేసుకోలేకపోయింది. సీనియర్ నేతలు పరాజయం పాలవ్వడమే కాక కాంగ్రెస్ అభ్యర్ధులకు డిపాజిట్ కూడా దక్కలేదు. సీనియర్ నేత సాకే శైలజానాథ్ పీసీసీ అధ్యక్షుడుగా పనితీరు సరిగా లేదని భావించిన పార్టీ అధిష్టానం గత కొంత కాలంగా పీసీసీ చీఫ్ మార్చే యోచన చేసింది.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని భావించి ఢిల్లీకి పిలిపించి పార్టీ పెద్దలు మాట్లాడినా అయన ఆ పదవి స్వీకరించేందుకు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలువురి నేతల పేర్లు ఏఐసీసీ పరిశీలించింది. చివరకు గిడుగు రుద్రరాజును హైకమాండ్ ఎంపిక చేసింది. గిడుగు రుద్రరాజు గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా కాంగ్రెస్ సహాయ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఎమ్మెల్సీగానూ పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు.
Hon'ble Congress President has approved the proposal of appointment of President, Working Presidents, Chairpersons of various committees, and the Constitution of Political Affairs Committee and Coordination Committee of the Andhra Pradesh Congress Committee, as follows. pic.twitter.com/O7g4oShZWy
— INC Sandesh (@INCSandesh) November 23, 2022