ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు . ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఉపశమనం. గత కొద్దికాలం కిందటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి.
ఇటీవల ఈ దోరణి కొనసాగుతుండటం అసలు రిలీఫ్.! గురువారం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ కేసులు తక్కువ అనే సంగతి తెలిసిందే.
ఏపీలో కేసులు ఎన్ని?
గురువారం 179 కేసులు నమోదు కాగా, బుధవారం 203 , మంగళవారం 121 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 100కు పైగా 200కు సమీపంలో ఉంటుండటం గతంలో ఉన్న ఉధృతి తగ్గిందనేందుకు నిదర్శనం. కాగా, గురువారం నాటికి ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,82,721కి చేరింది. ఇందులో 8,73,245 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,138 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 219 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇది పెద్ద రిలీఫ్ అని పలువురు పేర్కొంటున్నారు.
కరోనాపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
కరోనా పై సినీనటుడు మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో జరుపుకునేందుకు వచ్చిన ఆయన తన కుమార్తె మంచు లక్ష్మితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మకర సంక్రాంతి సందర్భంగా లక్ష్మిదేవి ప్రతి ఇంటికీ వచ్చి అందరినీ క్షేమంగా ఉంచాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా అందరూ తమ పూర్వీకులు.. పెద్దలను స్మరించుకుని వారిని తగిన రీతిలో గౌరవించుకోవాలని సూచించారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందర్నీ భయభ్రాంతులకు గురిచేసిన కరోనా భోగి మంటల్లో కాలి భస్మం అయిపోయిందని వెల్లడించారు. ‘పండుగ సందర్భంగా కరోనా భస్మం అయిపోవాలని కోరుకుంటున్నా.. నాకు తెలిసి ఇప్పటికే భోగి మంట్లో భస్మం అయిపోయి ఉంటుంది’’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.