ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ . వరుస సమస్యలు, విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇరుకున పడుతున్న జగన్ కు ఓ ఉపశమనం .
గత ఏడాది , గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం అంశంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్దం , విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలతో రాజకీయ పార్టీల కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇందులో కీలక అంశానికి తాజాగా ఉపశమనం దొరికింది.
అంతర్వేది లో కీలక నిర్ణయం
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం కావడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే , ప్రభుత్వం స్పందించి నూతన రథం తయారీ చేయిస్తోంది. కాగా, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మొదలు కానున్నాయి. 24 న రథోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో సమయానికి నూతన రథంలో స్వామి వారి ఊరేగించడానికి ఆలయ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది రథం ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరేగింపుగా రోడ్లపై వెళ్తున్నప్పుడు టర్నింగ్ తిరగడానికి నూతన టెక్నాలజీతో రథానికి జాకీలు ఏర్పాటు చేశారు. రథానికి నూతన టెక్నాలజీ ఉపయోగించి హైడ్రాలిక్ బ్రేకులు అమర్చారు. ఈ రథాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రథం తయారీ ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అనుకున్న టైం కంటే ముందుగానే పనులు పూర్తి చేశామని ఆయన అన్నారు.
రామతీర్థం లోనూ …
మరోవైపు రామతీర్థం ఆలయం ఘటనలో ధ్వంసమైన రాముడి విగ్రహం తో పాటు సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాలు తిరుపతిలో తయారు చేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ కి చెందిన సంప్రదాయ ఆలయ నిర్మాణం శిల్ప సంస్థలో విగ్రహాల తయారీ జరుగుతోంది. కంచి నుంచి రాయిని తెప్పించి శిల్పులు విగ్రహాలను చెక్కుతున్నారు. పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే శిల్పులు మూడు విగ్రహాలను అందించనున్నారని సమాచారం. నూతన విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన చేయనున్నారు.