AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అర్థం కావడం లేదు. ఇటీవలే ఆయన సస్పెన్షన్ గడువును మరో ఆరు నెలలు పొడిగించిన ప్రభుత్వం, న్యాయ పరంగా మాత్రం ముందుకెళ్లడం లో ఎందుకో వెనకడుగు వేస్తోంది. ఫలితంగా హైకోర్టుతో చీవాట్లు తింటోంది. న్యాయపరంగా కోర్టులతో మాటలు పడడం ప్రభుత్వానికి అధికారులకు కొత్త కాకపోయినప్పటికీ, ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఇప్పుడు వెనక్కి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ప్రభుత్వం అధికారుల ఆలోచన లో ఏ వెంకటేశ్వరరావు వ్యవహారం ఏమై ఉంటుంది అన్న అనుమానాలకు శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి .
కోర్టు అన్నది ఇలా…
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీబీ, సీఐడీ కౌంటర్ దాఖలు చేయకపోవటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ వేయడానికి ఇంత జాప్యమెందుకు చేశారని ప్రశ్నించింది.ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిద్ధమైంది. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏబీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఏసీబీ, సీఐడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చి వారాలు గడుస్తున్నా, దానికి ఎలాంటి స్పందన లేదు.
కౌంటర్ ఎక్కడ?
ఇంతవరకు ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తు ను ఓటు ఎందుకు పరిశీలించ కూడదు అన్న ఈ విషయంలో కేసు నమోదు చేసిన ఏసీబీ సి ఐ డి లు తగిన కౌంటర్ దాఖలు చేయాలి. ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వచ్చే పరిణామాలను కౌంటర్లో కోర్టుకు వివరిస్తే , దానికి న్యాయస్థానం అంగీకరిస్తే ఏబీ వెంకటేశ్వరరావు కు ముందస్తు బెయిల్ వుండదు. అయితే ఏసీబీ ఇటు సీబీఐ కోర్టుకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకుంటే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశాలిచ్చారు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.
గతంలోనూ ఆదేశించిన కోర్టు
ఏబీ అరెస్ట్ విషయంలో తొందరపాటుగా వ్యవహరించవద్దని.. పోలీసులను గతంలోనే ఆదేశించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఫైల్ చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని పోలీసుల తరపు న్యాయవాది ధర్మసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇంజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేయడమే కాకుండా, అదే సంస్థకు తన కుమారుడు ఇండియాప్రతినిథిగా ఉన్న సంగతిని దాచి పెట్టింది. ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీవై ఆరోపణలున్నాయి.
అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది. ఇంత కీలకమైన కేసులో అందులోనూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏవి వెంకటేశ్వరరావు పై పోరాడుతున్న కేసులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏసీబీ, సిఐడి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు అంతుబట్టడం లేదు. ఈ కేసులో కనుక మరోసారి కోర్టు కౌంటర్ దాఖలు చేయకుంటే, కేసు సాధారణ లోను కీలకం అవుతుంది. కేసు తేలిపోయే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.