AP Cinema: ఏపిలో సినిమా టికెట్ల ధరల నిర్ణయంపై ధియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీల నేపథ్యంలో పలు ధియేటర్లను స్వచ్చందంగా మూసివేశారు. ఈ సమస్యపై చర్చలు జరిపేందుకు ధియేటర్ల యాజమాన్యాలకు మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్ ఖరారు చేశారు. మరో పక్క ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్ధిక, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణాజిల్లా జేసితో పాటు ధియేటర్ల యాజమానులు, డిస్ట్రిబ్యుటర్లు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉంటారు. థియేటర్ల వర్గీకరణతో పాటు టికెట్ల ధరలను ఈ కమిటీ నిర్దారించనున్నది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
AP Cinema: 16 మందితో ఏపి ప్రభుత్వానికి లిస్ట్
ఈ క్రమంలో సినీ రంగం నుండి ప్రతినిధుల పేర్లు పంపాలని ఏపి ప్రభుత్వం కోరడంతో కమిటీని ఏర్పాటు చేశామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. మొత్తం అయిదురు నిర్మాతలు, అయిదుగురు డిస్ట్రిబ్యూటర్లు, ఆరుగురు ఎగ్జిబిటర్ల పేర్లను సెలెక్ట్ చేశామని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలియజేసింది. ఈ 16 మందిలో అయిదుగురు పేర్లను ఏపి ప్రభుత్వం సెలెక్ట్ చేయనుంది. ఈ అయిదుగురు సభ్యుల బృందంతో ఏపి సర్కార్ చర్చించనుంది.
కోర్టు ఆదేశాలతో…
సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35పై కొందరు థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ జివోను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. పాత విధానమే అమలు చేసుకోవాలని సూచించారు. అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనంలో సవాల్ చేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం సినిమా టికెట్ల కు సంబంధించి ధియేటర్ల యజమానులు తమ ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపింది. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది.