Grama Panchayats: ఏపిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ అకౌంట్లకు నిధులు వెనక్కు వచ్చేశాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులు రాత్రికి రాత్రి మాయం అయ్యాయి. గతంలో 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.7.600 కోట్లను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు తెలియకుండానే ప్రభుత్వం తీసేసుకుని విద్యుత్ చార్జీలకు చెల్లించింది. ఇప్పుడు కూడా అలానే ప్రభుత్వం గ్రామ పంచాయతీల సాధారణ నిధులను ప్రభుత్వం తీసేసుకుందని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు భావించారు. ఈ నెల 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ చూపడంతో సర్పంచ్ లు షాక్ అయ్యారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే కొందరు కార్యదర్శులు మాత్రం ఇయర్ ఎండింగ్ కావడంతో సాంకేతిక లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు. రెండు మూడు రోజుల్లో నిధులు వెనక్కి వస్తాయని భావించారు. అయితే ఈ నెల 5వ తేదీ వరకూ పంచాయతీ అకౌంట్ లకు నిధులు వెనక్కు రాలేదు. అధికారులు దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వమే నిధులు మళ్లించిందని సర్పంచ్ లు అనుకున్నారు. దీనిపై సర్పంచ్ లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Grama Panchayats: సర్పంచ్ లు భిక్షాటనతో నిరసన
రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన 12,918 గ్రామ పంచాయతీల నిధులను వెంటనే తిరిగి పంచాయతీల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపి పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ సర్పంచ్ లు భిక్షాటనతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిధులు వెనక్కు ఇవ్వకపోతే గ్రామస్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ లు అందరూ కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులను సైతం ప్రభుత్వం తీసేసుకుంటే గ్రామాల్లో పనులు ఎలా సాగుతాయంటూ సర్పంచ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఖాతాలకు నిధులు జమ
ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 14,15 వ ఆర్ధిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు పంపిన నిధులు రూ.7,660 కోట్లు ప్రభుత్వం తీసుకోగా ఇప్పుడు తాజాగా ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర జనరల్ ఫండ్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఉన్న రూ.4వేల కోట్లను సర్పంచ్ లకు చెప్పకుండా, వారి సంతకం లేకుండా రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని బాబూ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలా చేస్తే గ్రామాల్లో ప్రజలకు సర్పంచ్ లు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికేనా ఆర్ధిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులు మొత్తం రూ.11, 600 కోట్లు వెంటనే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఓ పక్క సర్పంచ్ లు ఆందోళనలు చేస్తున్న తరుణంలోనే బుధవారం గ్రామ పంచాయతీ ఖాతాలకు జనరల్ ఫండ్ నిధులు జమ అయ్యాయి. దీంతో సర్పంచ్ లు, కార్యదర్శులు ఊపిరిపీల్చుకున్నారు.