Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కనుందో ఖరారైంది. ఉదయం 10గంటల 45నిమిషాలకు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి 97 మంది సభ్యుల కోరంతో చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కేకే తనయ విజయలక్ష్మీకి చాన్స్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Greater Hyderabad : మొదటి నుంచి అదే టెన్షన్
గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 150 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 56 స్థానాలతో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 47, ఎంఐఎంకు 44, కాంగ్రెస్కు రెండు డివిజన్లు దక్కాయి. 149 కొత్త కార్పొరేటర్లు కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులు 44 మందితో కలుపుకొని మొత్తం 193గా ఉంది. దీంతో మేజిక్ ఫిగర్ 97కి ఎవరు చేరుతారనేది ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎంఎఐంకు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉంటే.. అటు బీజేపీకి ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీ ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకే మేయర్ పీఠం దక్కనుంది. ఇప్పటికే టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులకు అధిష్టానం విప్ జారీ చేసింది. టీఆర్ఎస్ నుంచి మేయర్ ఎన్నిక పరిశీలకులుగా మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీ కేకే.. డిప్యూటీ మేయర్ ఎన్నికకు విప్గా ఎమ్మెల్సీ ప్రభాకర్ ఉండనున్నారు.
బీజేపీ కొత్త గేమ్
మరోవైపు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని BJP నిర్ణయించుకుంది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు. ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, MLA రాజాసింగ్ ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. ఏకపక్షంగా మేయర్ పీఠాన్ని TRSకు అప్పచెప్పడం సరికాదనే ఉద్దేశంతోనే తాము పోటీలో నిలుస్తున్నట్టు BJP నేతలు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లతో BJP ముఖ్యనేతలు సమావేశం అయ్యారు.