ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. అయితే వరద ఉదృతికి గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటు విరిగి నీటిలో కొట్టుకుపోయింది. గేటు కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోని నీరు వృధాగా సముద్రంలోకి వెళుతోంది. దాదాపు 3వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తొంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని మరమ్మత్తు చర్యలపై చర్చిస్తున్నారు. ప్రాజెక్టుకు వరద నీరు వస్తున్న నేపథ్యంలో నీరు వృధా పోకుండా చర్యలు ఎలా చేపట్టాలనే దానిపై ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా మద్దిపాడు మండలం మల్లవరం వద్ద 2008లో గుండ్లకమ్మ రిజర్వాయిర్ ను నిర్మించారు. అయితే గేటు స్ప్రింగ్ లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోలేదన్న మాటలు వినబడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.