YSRCP: వైసీపీలో పలువురు సీనియర్ ప్రజా ప్రతినిధులు రాబోయే ఎన్నికల్లో వారి వారసులను ఎన్నికల రంగంలోకి దింపాలని సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ వారి వారసులే చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి లు తమ మనసులోని మాటను ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ కుమారులు పోటీ చేస్తారని చెప్పగా, అందుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అంగీకరించలేదని తెలిసింది. రాబోయే ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని బుగ్గన, పేర్ని లకు జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలా మరి కొందరు నేతలు కూడా తమ వారసులను ఎన్నికల రంగంలోకి దింపాలని భావిస్తున్నా పేర్ని, బుగ్గన ప్రతిపాదనలను జగన్ తిరస్కరించడంతో తమ మనసులోని మాటను సీఎం దృష్టికి తీసుకురాలేదు.
అయితే తాజాగా గుంటూరు తూర్పు వైేసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా బహిరంగంగా సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి విజయం సాధించిన ముస్తాఫా కూడా తను రాజకీయాల నుండి తప్పుకుని కుమార్తె ఫాతిమాను ఎన్నికల బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, తన బదులుగా తన కుమార్తె ఫాతిమా పోటీ చేయనున్నదని చెప్పారు ముస్తాఫా, ఫాతిమాకు పార్టీ హైకమాండ్ మద్దతు ఉందని, జగన్ ఆశీస్సులతోనే ఫాతిమా పోటీ చేస్తుందని ముస్తాఫా తెలిపారు.
ముస్తాఫా ప్రతిపాదనను సీఎం జగన్ అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పార్టీ లో చర్చనీయాంశం అవుతోంది. ముస్తాఫా కుమార్తె కు టికెట్ ఇవ్వడానికి జగన్ అంగీకరిస్తే మరి కొందరు కూడా తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఇప్పటికే బుగ్గన, పేర్ని లు చేసిన ప్రతిపాదనకు నో చెప్పిన సీఎం జగన్ .. ముస్తాఫా విషయంలో ఇతర నాయకుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేది వైసీపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ధఫా నిర్వహించే గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో నేతల వారసుల రాజకీయ రంగ ప్రవేశంపై జగన్ మరో సారి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.