CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది కస్టమర్ లు లీగల్ నోటీసులు పంపించారు. 2021 నాటికి ప్లాట్లు అందజేయాలన్న నిబంధన ఉన్నా గడువు తీరినా ప్లాట్లు అప్పగించకపోవడంతో తాము చెల్లించిన పది శాతం సొమ్మును 14 శాతం వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో కోరారు. అలాగే రూ.20లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేకుంటే సీఆర్డీఏపై రేరా చట్టం కింద కేసు వేస్తామని కొనుగోలు దారులు పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ద్వారా సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపారు.
Read More:AP High Court: ఏపి సర్కార్పై కీలక కామెంట్స్ చేసిన హైకోర్టు..
AP CRDA: ఒప్పంద గడువు ముగిసిపోవడంతో..
అమరావతి రాజధాని పరిధిలో 2018లో అప్పటి ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా అత్యాధునిక హంగులతో హ్యాపీనెస్ట్ నివాస సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్మించే 12 టవర్లలో 1200 ప్లాట్ లు కడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో హ్యాపీనెస్ట్ ప్లాట్లు అన్నీ గంట వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. సీఆర్డీఏ ఒప్పందం మేరకు తొలి వాయిదాగా కొనుగోలుదారులు పది శాతం సొమ్ము చెల్లించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి షాపూర్జీ పల్లోంజీ టెండర్లకు ముందుకు వచ్చింది. డిసెంబర్ 31, 2021 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడంతో హ్యాపీనెస్ట్ నిర్మాణం నిలిచిపోయింది. గత ఏడాది రీ టెండర్ల పేరుతో హడావుడి చేసినా ఎవరూ ముందుకు రాలేదు. ఒప్పంద గడువు ముగిశాక నెలన్నరకుపైగా వేచి చూసిన కొనుగోలుదారులు సీఆర్డీఏకు లీగల్ నోటీసులు పంపారు. ఈ నోటీసులపై సీఆర్డీఏ, జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.