BJP : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్తగా టార్గెట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సీఎం జగన్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోందా? స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కదులుతున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేయడం , అదే సమయంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి.
BJP : ఢిల్లీలో మారుతున్న సీన్
ఏపీలో ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో కీలక మార్పులు జరిగాయి. రాజ్యసభలో విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు జవాబు ఇచ్చిన ధర్మేంద్ర ప్రధాన్.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబరిచిందని రాజ్యసభ ప్రకటించారు. పోస్కో – ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్లో న్యాయపరంగా కట్టుబాట్లు లేని అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరినట్లు చెప్పారు.
దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్న ఆయన.. ఈ దశలో ఎవరి వాటా ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఎంవోయూ ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్లో 50 శాతం తమకు ఉండాలని పోస్కో స్పష్టం చేసిందన్నారు. సాయిరెడ్డి ప్రశ్నకు సభలో రాతపూర్వకంగా జవాబిచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఈ మేరకు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
జగన్ పరిష్కారం చూపినప్పటికీ….
ఏపీలో ఆందోళనలు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న సీఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానికి లేఖ రాశారు.
వైజాగ్ స్టీల్స్ పునరుద్దరణ కోసం కీలకమైన సలహాలు, పరిష్కారాలతో సీఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ కు సొంత ఇనుప ఖనిజం గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటి పరిష్కార మార్గాలు చూపించారు. అయితే కేంద్రం ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున, అదే సమయంలో రాష్ట్రంలో జరిగిన చర్చల వివరాలను వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం టార్గెట్ గా గేమ్ జరుగుతోందా? అనే చర్చ తెరమీదకు వస్తోంది.