టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హార్ట్ అటాక్ తో అస్వస్థతకు గురైయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు పరీక్షల అనంతరం స్టెంట్ వేశారు. అర్జునుడికి బీపీ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అర్జునుడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అర్జునుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. విషయం తెలిసిన పలువురు టీడీపీ నేతలు రమేష్ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గర అవ్వడంతో పార్టీ అధినేత నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అర్జునుడుకి అప్పగించారు. 2021లోనూ బచ్చుల అర్జునుడు హార్ట్ అటాక్ కు గురైయ్యారు. అప్పుడు కూడా రమేష్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించగా అత్యవసర శస్త్ర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడింది. అయితే ఈవేళ మరో సారి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత