ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీ వద్ద కు భారీ వరద నీరు చేరుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో శుక్రవారం ఉదయానికి 3,53,489 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం 3.90 వేల క్యూసెక్కులకు చేరితే ప్రకాశం బ్యారెజీ వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు బ్యారెజ్ 70 గేట్లు 8 అడుగులు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
పులిచింతల వద్ద ఔట్ ప్లో 4.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి సాయంత్రానికి వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచనలు జారీ చేశారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెబుతున్నారు. నాగార్జున సాగర్ వద్ద 4.14 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 4.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద ప్రభావం 5 లక్షల క్యూసెక్కులకు పైగా రానున్న నేపథ్యంలో తాడేపల్లి కరకట్ట వెంబడి గ్రామాలలో పాతూరు, చిరావూరు గ్రామాలలో ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారెజ్ ల వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని కృష్ణానది పరవళ్లు తిలకిస్తున్నారు. సాగర్ వద్ద 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరికి మళ్లీ బారీగా వరద .. సముద్రంలో కలుస్తున్న 14లక్షల క్యూసెక్కులపైగా నీరు