ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. మరో పక్క మున్నేరుకు వరద పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉదృతి అధికమైంది. గరిష్ట నీటి మట్టం 12 అడుగులు దాటి ప్రవహిస్తొంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 50 గేట్లను అర అడుగు మేర, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 80వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరో పక్క డెల్టా కాలువకు 5800 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలన చేస్తున్నారు.
ఎగువ ప్రాంతంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత ఎక్కువగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో వరద దిగువకు విడుదల చేస్తామని అదికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న పేదలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం లక్షకుపైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేసే అవకాశం ఉంది.