గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు నిండు కుండలుగా మారాయి. నిన్న మొన్నటి వరకూ కురిసిన భారీ వర్షాల తో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు దసరా ఉత్సవాల వేళ ప్రజలు ప్రముఖ ఆలయాల సందర్శనకు ప్రయాణం అవుతున్నారు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఒడిశా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా బంగాళాఖాతం లో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో మారో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుండి మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లు, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు మరో సారి వాయుగుండం ప్రజలను మరింతగా భయపెడుతోంది.
కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్.. కలిసి వచ్చే పార్టీలు ఇవే..?