Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద టెన్షన్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ చూసి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హోటల్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. విశాఖలో సెక్షన్ 30 అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు నోటీసు జారీ చేయడంతో పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్ కే పరిమితమైయ్యారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హోటల్ వద్దకు చేరుకోవడంతో భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నారు. హోటల్ పై నుండి పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేశారు. మరో పక్క పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చల్లాగాలి కోసం ఆర్కే బీచ్ కు వెళ్లాలని ఉందని, అనుమతి ఉందా అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అదే విధంగా “ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడ కెళ్తోవోచ్..రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా..మా వైసిపికి ఇస్తావా..మా థానోస్ గూట్లో పెడతావా” అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు.
మరో పక్క పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పోలీసులు ఆంక్షలు విధించడంపై ప్రశ్నించారు. ఇదే సమయంలో గతంలో విశాఖలో తనకు జరిగిన అనుభవాన్ని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తొంది. ప్రభుత్వ చర్యలను చంద్రబాబు ఖండించారు. జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా తమ వైఖరి కొనసాగిస్తే జనసేనతో కలిసి బీజేపీ పోరాటం చేస్తుందని సోము వీర్రాజు తెలిపారు,
పోలీసులు జారీ చేసిన నోటీసులపై జనసేన ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమై పరిస్థితిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అరెస్టు అయిన జనసేన కార్యకర్తలను బయటకు తీసుకువచ్చేందుకు ఆయన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. అరెస్టు అయిన వారిని బయటకు తీసుకువచ్చిన తర్వాతనే తాను హైదరాబాద్ బయలుదేరి వెళ్లాలని అనుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ విడిచి వెళ్లే విషయంలో పవన్ కళ్యాణ్ ఏమి తేల్చకపోవడంతో హోటల్ వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు.
Janasena: పవన్ కళ్యాణ్ కు పోలీసులు షాక్ .. విశాఖ విడిచి వెళ్లాలంటూ నోటీసులు