Majlis : ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసినా Majlis మజ్లీస్ పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు విస్తరిస్తోంది. ఇప్పటికే బీహార్లో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకుని, గుజరాత్, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ సత్తా చాటిన జోష్ తో ఉన్న మజ్లిస్ ఇప్పుడు తన దృష్టిని ఆంధ్ర ప్రదేశ్ మీద పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటుంది.
పట్టు ఎక్కడ?
మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మజ్లిస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం కర్నూలు జిల్లా ఆదోని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పార్టీ తరఫున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరికి వస్తుండడంతో మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ముఖ్యంగా ముస్లింల ఐక్యత మీద ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ మీద వాడివేడి విమర్శలకు దిగుతున్నారు.
అలా ముందుకు వెళ్లాలని
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రస్తుతం తాము నిలబెట్టిన అభ్యర్థులు ఎంతమేర ఎన్నికల్లో సఫలీకృతం అవుతారు చూసి తదుపరి కార్యాచరణ ఉంటుందని మజ్లిస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తే కనుక పార్టీని విస్తరించి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం కొన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు మజ్లిస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైన అసెంబ్లీ స్థానాలను మజ్లిస్ పార్టీ గుర్తించింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు పశ్చిమ ప్రాంతం, కృష్ణ, గుంటూరు జిల్లా ల మీద ప్రధానంగా మజ్లిస్ పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కమలం కోసం
బిజెపి లక్ష్యంగానే మజ్లీస్ పార్టీ రాజకీయాలను చేస్తోంది. ఏ రాష్ట్రానికి వెళ్లిన బీజేపీ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీతోనే జట్టు కడుతోంది. ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షంగా బీజేపీ ఉంటే ప్రత్యక్షంగా ఆ పార్టీ మీద విమర్శలు చేయడం, ఒకవేళ బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ను కట్టడి చేయడంలో అధికార పక్షం విఫలం అయిందనే కోణంలో ప్రచారం చేస్తూ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బిజెపి విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఆ పార్టీని దెబ్బ కొట్టెందుకు, రాజకీయంగా పోటీ ఇచ్చేందుకు మజ్లిస్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దేశమంతటా విస్తరణ మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి పెట్టినట్లు అర్థం అవుతోంది. వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీతో ఆయన స్నేహపూర్వక సంబంధం కొనసాగించారు. అయితే ఇప్పుడు బిజెపి ప్రధాన అజెండాగా వస్తున్న మజ్లిస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుంది అన్నది చూడాలి. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆధారంగా మజ్లిస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలన్న కార్యాచరణను రూపొందించుకునే అవకాశం కనిపిస్తుంది.