Huge compensation to the Sarpavaram affected families : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో గల సర్పవరం టైకీ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై నిన్న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు కాకర్ల సుబ్రమణ్యం (31), తోటకూర వెంకట రమణ (37) అక్కిడకక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు మంత్రి కురసాల కన్నబాబు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపారు.
అనంతరం మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.10లక్షలు, కంపెనీ తరపున రూ.40 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం లక్ష, కంపెనీ తరుపున రూ.3లక్షలు వంతున అందిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా మృతుల కుటుంబాలలో ఒకరికి కంపెనీ తరపున ఉద్యోగం, ప్రభుత్వం తరపున ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాల పక్షాన పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు వెల్లడించారు.