Machilipatnam : నమ్ముకున్న వారికి అండగా ఉండటం, వారికి కష్టకాలంలో తోడుగా ఉండడం నిజమైన నాయకుడి లక్షణం. అందులోనూ ఓటమి లోను, విషయంలోనూ ఎప్పటికీ తోడుండే ఆత్మీయులను, అనుచరులను కాపాడుకోవడం నాయకుడు విధి. మచిలీపట్నం రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తన ఆప్తుని కుటుంబానికి అండగా నిలిచారు. రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు.
గతేడాది జూన్ 29 వ తారీకున మచిలీపట్నంలో హత్యకు గురైన మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మ కు మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ పీఠం దక్కింది. గురువారం జరిగిన మేయర్ ఎంపికలో మరో మాటకు తావులేకుండా మంత్రి ఏకవాక్యంతో ఆమెను మేయర్ చేశారు. మోకా భాస్కరరావు మొదటి నుంచి మంత్రి పేర్ని నాని కి ప్రధాన అనుచరుడు. ఆయనను నమ్ముకుని రాజకీయాలు చేసిన భాస్కరరావు రాజకీయంగా శత్రువులను సంపాదించుకున్నారు.
భాస్కర రావు ఎదుగుదలను చూడలేని ప్రత్యర్థి చింత చిన్ని ఓ పథకం ప్రకారం భాస్కరరావును హత్య చేయించారు. టీడీపీ హయాంలో అన్ని పదవులు అనుభవించిన చింతా చిన్ని మీద ఏ విషయంలో, ఎప్పుడూ భాస్కరరావు వివాదానికి వెళ్లలేదు. 2019లో వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భాస్కరరావు తమ ప్రాంతంలో ఆధిపత్యం, అధికారం చెలాయించడం తట్టుకోలేని ప్రత్యర్థులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహాయంతో భాస్కరరావును కిరాతకంగా హత్య చేశారు. ఆ సమయంలో మంత్రి పేర్ని నాని కన్నీరు పెట్టుకుని తన అనుచరుడిని సాగనంపారు.
భాస్కర్ రావు హత్య విషయంలో ప్రత్యర్థులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అండదండలు అందించారని, అంతా తాను చూసుకుంటానని అభయం ఇచ్చారని పోలీసు దర్యాప్తులో తేలింది. టిడిపి ప్రభుత్వ హయాంలో భాస్కర రావు కు ఎలాంటి కాంట్రాక్టులు దక్కకుండా పూర్తిగా ఆర్థిక ద్వారాలు మూసివేసినా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. గతంలో మచిలీపట్నం మార్కెట్యార్డు చైర్మన్గా పనిచేసిన భాస్కరరావు 4, 5 వార్డుల ప్రజలను పూర్తిగా ప్రభావితం చేయగలరు. దీంతో రాజకీయంగా ఎప్పటికైనా భాస్కరరావు తమకు అడ్డంకి అవుతారని భావించిన ప్రత్యర్థులు, ఎలాంటి పెద్ద గొడవలు లేకపోయినా సరే అడ్డు తొలగించుకోవాలని భావించారు. దీనికి టిడిపి నాయకులు వత్తాసు పలకడంతో ప్రత్యర్థులు భాస్కరరావును అంతమొందించారు.
భాస్కర్ రావు హత్య తర్వాత ఆ కుటుంబానికి మంత్రి పేర్ని నాని పూర్తి అండదండలు అందించారు. ఆర్థికంగానూ వారి అవసరాలను తీర్చడం తో పాటు రాజకీయంగా కూడా ఎదిగేందుకు ప్రత్యర్థులకు బలమైన శక్తిగా తయారు చేసేందుకు ఆయన మున్సిపల్ ఎన్నికల ను వేదికగా చేసుకున్నారు.
మోకా భాస్కరరావు వెంకటేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కుమార్తె. చేతికి అంది వచ్చిన కుమారుడు భాస్కర్ రావు హత్య కు ముందే అనారోగ్యంతో మృతి చెందాడు. కూతురికి భాస్కర్ రావు చేతుల మీదుగానే పెళ్లి చేశారు. వెంకటేశ్వరమ్మ మామ మోకా రాములు గతంలో మచిలీపట్నం పురపాలక సంఘం కౌన్సిలర్ గా పనిచేశారు. ఆయన రాజకీయ వారసత్వం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన మోకా భాస్కరరావు మంత్రి పేర్ని నాని కు దగ్గరయ్యారు. నాని వెనకాలే తిరిగేవారు. భాస్కర రావు ఉన్న సమయంలోనే వెంకటేశ్వరమ్మ మూడుసార్లు మచిలీపట్నం కౌన్సిలర్ గా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు.
అయితే భర్త చాటు భార్యగానే రాజకీయాలు చేస్తూ ఇంట్లో గృహిణిగా ఉండేవారు. భాస్కర రావు హత్యకు ముందు ఆయన 23 వ డివిజన్ కార్పొరేటర్గా అధికార పార్టీ తరఫున నామినేషన్ వేస్తే ఆయన డమ్మీ గా మోకా వెంకటేశ్వరమ్మ ఒక జత నామినేషన్ వేశారు. జూన్లో భాస్కర్ రావు హత్య తర్వాత వెంకటేశ్వరమ్మే ఆ డివిజన్ కు వైకాపా అభ్యర్థిగా మారి కోటి లో నిలిచారు. ఎన్నికల్లో విజయం సాధించి జనరల్ మహిళలకు కేటాయించిన మచిలీపట్నం మేయర్ పీఠన్ని వెంకటేశ్వరమ్మ అధిరోహించడం తో మంత్రి తన అనుచరుడికి అత్యుత్తమ, అరుదైన గౌరవం ఇచ్చినట్లయింది.