ఆనారోగ్యంతో బాధపడుతున్న భార్య భర్తలు ఇద్దరూ ఒకే రోజు గంటల వ్యవధిలో మృతి చెందడం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామస్తులను కలచివేసింది. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య 24 గంటలు గడవక ముందే కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే .. నరుకూరు గ్రామానికి చెందిన రమణ (40), సములత (36) దంపతులు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం చికిత్స నిమిత్తం రమణను కుటుంబ సభ్యులు చెన్నై తరలించారు.
అదే సమయంలో భార్య సుమలత కూడా అనారోగ్యానికి గురవడ్డంతో ఆమెను చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు. రమణ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం ఉదయం చెన్నై నుండి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రమణ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు రమణ అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే భర్త అంత్యక్రియలు పూర్తి అయిన కొద్ది గంటల వ్యవధిలోనే భార్య సమలత చెన్నైలోని ఆసుపత్రిలో మృతి చెందారు. ఒకే రోజు గంటల వ్యవధిలో భార్య భర్తలు ఇద్దరూ మృతి చెందడం గ్రామస్థులను కలచివేసింది.