Corona: దేశంలో ఇప్పుడంతా కరోనా కలకలమే. కేసుల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయం , ఆదేశాలపై అందరి చూపు పడింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక విషయాలను వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం ఆ ఎనిమిది రాష్ట్రాల్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటేసిందని తెలిపారు.
కరోనా కేసుల కలకలం
కరోనా కట్టడిలో భాగంగా జరుగోతన్న వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోందని.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14.19 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ పూర్తిచేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోన్ననేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామని.. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ రవాణా సవాల్గా మారిందని.. కానీ, ఆక్సిజన్ ట్యాంకర్ల మూవ్మెంట్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని లవ్ అగర్వాల్ వెల్లడించారు.
ఇంట్లో ఉన్నా కూడా ఏం చేయాలంటే…
ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందేనని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. ఇది కోవిడ్ సమయం.. కాబట్టి మీ ఇళ్లకు ఎవ్వరినీ రానియొద్దు.. మీరు కూడా అనవసరంగా ఎక్కడికి వెళ్లొద్దని సూచించారు. “ప్రజలు తమ ఇళ్లలో కూడా ముసుగులు ధరించడం ప్రారంభించాల్సిన సమయం ఇది” అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. పెరుగుతున్న అంటువ్యాధుల దృష్ట్యా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ఆస్పత్రులు ఆక్సిజన్ మరియు బెడ్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.