Lock down: దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే సమయంలో కొత్త టాక్ తెరమీదకు వచ్చింది. మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. మళ్లీ లాక్ డౌన్ ను విధించే ఆలోచన కేంద్రానికి లేదని క్లారిటీ ఇచ్చారు.
కేంద్రం మాట ఇది…
కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో…ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులే నియంత్రణా చర్యలు చేపడతారని, కఠిన నిబంధనలను వారు అమలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేసులు వచ్చిన ప్రాంతాల్లో మాత్రం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, ఈ విషయంలో రాష్ట్రాలు ఇచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. గతేడాది లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్న నిర్మలా సీతారామన్.. మరోసారి అటువంటి పరిస్థితిని తీసుకుని రావడం తమకు ఇష్టం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు.
కేసుల కలకలం…
ఇదిలాఉండగా దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవుతుండగా బుధవారం ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో 1,85,190 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కి చేరింది. ఇందులో 1,23,36,036 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనాతో 24 గంటల్లో 1026 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొతం కరోనా మరణాల సంఖ్య 1,71,929కి చేరింది.