Corona: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా కలకలం తెలంగాణలోనూ తన ఉధృతిని సాగిస్తోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ చికిత్స విషయంలో కావాల్సిన ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణకు రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు ప్రస్తుతం రోజూ ఇస్తున్న 5,500 రెమ్డిసివిర్ ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10,500కు పెంచుతున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎక్కడి నుంచంటే…
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒడిశాలోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ చేసి చెప్పారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ ను కోరారు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాగా, కేంద్రం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది. ఈ మేరకు రాబోయే ఒకట్రెండు రోజుల్లో తొలిదశ ఆక్సిజన్ కాన్సంటేటర్లు అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
ఇదీ పరిస్థితి..
కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,816 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. మరో 27 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 5,892 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55 శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.80శాతంగా ఉంది. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 44,985 టెస్టులు చేయగా.. ప్రస్తుతం 50,969 యాక్టివ్ కేసులున్నాయి. కాగా జీహెచ్ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.