మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడపాలని చూసే రాజకీయ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ లు వేశారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ ఫ్యామిలీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
వైయస్ తాతగారు నుండి వాళ్ల ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ. అయినా గాని.. హిందూ సాంప్రదాయాలకు గౌరవం ఇస్తారు అని చెప్పుకొచ్చారు. విజయమ్మ సోదరి..వై.వి.సుబ్బారెడ్డి భార్య నిత్యం పూజలు చేస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. అసలు గోమాతకు దండం పెట్టనిదే, పూజ చేయనిదే గుమ్మం నుండి బయటకు ఆమె అడుగు పెట్టద్దు అని స్పష్టం చేశారు.
స్వతహాగా నేను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాడిని, అయినా గాని.. మా కంటే ఎక్కువగా వైయస్ ఫ్యామిలీలో పూజలు చేసే వారు ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో జగన్ సొంత బాబాయ్ వై వి సుబ్బారెడ్డి చాలా నిష్ఠగా ఉంటారని, అతడు నాకంటే కరుడుగట్టిన హిందువు అంటూ ఉండవల్లి పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం చేసిన వారిని పోలీసులు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరూ ఊహించని విధంగా కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.