Infant Baby: శ్రీకాకుళం జిల్లాలో ఆమానవీయ సంఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును ప్రాణంతో ఉండగానే ఖననం చేశారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును కొన ఊపిరితో ఉండగానే గుడ్డ ముక్కలతో చుట్టి ఖననం చేయడానికి కాటికి పంపించారు. కాశిబుగ్గలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచి వేసింది.
విషయంలోకి వెళితే.. నందిగాం మండలానికి చెందిన ఒ మహిళ నెలలు నిండక ముందే ఏడవ నెలలో కాశీబుగ్గలోని ఒ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అసుపత్రి వైద్యులు సిజేరియన్ చేశారు. ఆడపిల్ల పుట్టిందని వైద్యుడు చెప్పారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే పసికందు మృతి చెందింది, పాతి పెట్టాలంటూ బిడ్డ తాలుకూ వ్యక్తులు వేరే వ్యక్తులను పురమాయించారు. వారు ఆ బిడ్డలను తీసుకుని వెళ్లి ఖననం చేసేందుకు గొయ్యి తీస్తుండగా బిడ్డ కదలడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏమి చేయాలో తెలియని స్థితిలో వారు అలాగే ఉండిపోయారు. కాసేపు పెనుగులాట తర్వాత బిడ్డ కదలడం మానేసింది. దీంతో వారు కూడా చేసేది ఏమి లేక చనిపోయిందని నిర్ధారించుకుని ఖననం చేశారు.
అయితే ఆ వ్యక్తి శిశువును పాతిపెడుతూ ఫోటోలు, వీడియోలు తీశాడు. అవి బయటకు రావడంతో సంచలనంగా మారింది. నెటిజన్ లు, స్థానికులు ఆసుపత్రి తీరుపై మండిపడుతున్నారు. విషయం వైరల్ కావడంతో పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు.