Chandra Babu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎదురైన వరుస పరాజయాల నేపథ్యంలో ఓటమి భయం పట్టుకుందా? అందుకే త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారా? అంతే కాకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు.
బాబు గారి కీలక నిర్ణయం
ఏపీలో ఇప్పుడు అందరి చూపు తిరుపతి ఉప ఎన్నికపైనే పడింది. తిరుపతి బైపోల్స్ కు ఆయా పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగాటీడీపీ అధినేత చంద్రబాబు ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ముఖ్యనేతలు, తిరుపతి ఇంచార్జ్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరితో సుధీర్ఘంగా చర్చించిన చంద్రబాబు…అనంతరం తరువాత నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు. ఎన్నికల్లో పోటీపై సలహాలు సూచనలు తీసుకున్నారు. నేతలకు దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా పలు హెచ్చరికలు సైతం చంద్రబాబు జారీ చేశారు.
స్ట్రాంగ్ వార్నింగ్…
తిరుపతి ఉప ఎన్నికలో క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈ ఉప ఎన్నిక తర్వాత ఇక ఎటువంటి ఎన్నికలు ఉండవని.. వీటిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఇంచార్జ్ లు గట్టిగా పని చెయ్యకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలన్నా.. ఇంచార్జ్ లుగా కొనసాగాలన్నా ఈ ఎన్నికలే కొలమానమంటూ నేతలకు సూచించారు. తిరుపతి ఉప ఎన్నికను సమన్వయ పరచడానికి 5గురు నేతలతో కమిటీ ఏర్పాటు చేశారు. అచ్చెనాయుడు, సోమిరెడ్డి, లోకేష్, బీద రవిచంద్రతో పాటు.. పనబాక కృష్ణయ్య ఈ కమిటీలో ఉంటారు. దీంతోపాటుగా తిరుపతిని మొత్తం 70 క్లష్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ కు 30 బూత్లు ఉంటాయి. వీటిని సీనియర్ నేతలను ఇంచార్జ్ లుగా నియమిస్తున్నారు. 20వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. తాను కూడా ప్రచారానికి వస్తానని తెలిపారు.