Vidadala Rajani: వైసీపీలో సోషల్ మీడియాలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడతల రజినీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికల్లో మొదటి సారి రాజకీయ రంగ ప్రవేశం చేసి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా విడతల రజని చిలకలూరిపేటలో వైసీపీ తరపున పోటీ చేసి మంచి మెజార్టీతో విజయం సాధించారు.
ఆ గెలుపు తరువాత ఆమె రాజకీయ జీవితం మలుపు తిరిగింది.ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గానికో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా ఖాతాలను చూసినా, సోషల్ మీడియాలో అభిమాన గణాన్ని చూసినా స్థానికేతరులే ఎక్కువ మంది ఉన్నారు. ఎళ్ల తరబడి సినీరంగంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చిన రోజాకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంతే విడతల రజనికి కూడా ఉంది. అయితే ఈ రెండు సంవత్సరాల్లోనే నియోజకవర్గంలో కొంత చీకటి కోణాలు కూడా ఉన్నాయి.
Vidadala Rajani: విడతల రజినీ పీఏకి శ్రీకృష్ణదేవరాయలు పిఏ మద్య వివాదం
ఏడు ఎనిమిది నెలల క్రితం రజని పీఏ, ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పిఏ మద్య వివాదం నడిచి వారి ఇద్దరి మద్య ఫోన్ కాల్ సంభాషణల ఆడియో లీక్ అయ్యాయనీ, ఎమ్మెల్యే కాల్ రికార్డులు లీక్ చేశారనీ వివాదం నడిచింది. ఆ వివాదం గుంటూరు డీఎస్పీ సస్పెన్షన్ వరకూ వెళ్లింది. ఆ తరువాత వైసీపీ పెద్దలు కలుగజేసుకుని రాజీ కుదుర్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట పర్యటనకు వచ్చిన సమయంలో రజని వర్గం ఆయనను అడ్డుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విబేధాలు ఉన్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.అయితే ఇప్పటి వరకూ ఆమెపై అవినీతి ఆరోపణలు రాలేదు
కానీ మొట్టమొదటి సారిగా అతి పెద్ద అవినీతి ఆరోపణ కూడా ఇప్పుడు వచ్చింది. అది ఏమిటంటే.. చిలకలూరిపేట నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా ఉంటుంది. అక్కడ అనేక గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా బల్లికువర, మార్టూరులో ఎలాగైతే క్వారీలు ఉన్నాయో అలానే చిలకలూరిపేటలోనూ క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ తవ్వకాల కోసం భూములు ఇవ్వాలని కొంత మంది పేద రైతులను ఎమ్మెల్యే రజని వర్గం బలవంతం చేసి ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా ఎస్సీ కమిషన్ అధికారులు కొంత మంది గుంటూరు జిల్లా అమరావతికి వచ్చినప్పుడు చిలకలూరిపేటకు చెందిన రైతులు కలిసి ఫిర్యాదు చేశారు. మైనింగ్ కోసం భూములు ఇవ్వాలని మురుకుపూడి ఆదిబాబు అనే రైతుపై అధికార పార్టీ వ్యక్తులు దాడి చేశారనీ రైతులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రజని అండతోనే అధికార పార్టీ నేతలు తమ పై దాడి చేశారనీ, దళితుల స్మశానం కూడా కబ్జా చేశారనీ ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో దళితులకు ఇచ్చిన స్థలాలను వైసీపీ వర్గీయులు కబ్జా చేశారని మరో రైతు ఫిర్యాదు చేశారు.
గతంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదనీ, పైగా భూములను గ్రానైట్ క్వారీయింగ్ కోసం బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి.ఇప్పటి వరకూ వివాదాస్పదంగా లేని విడతల రజినిపై తొలి సారిగా పెద్ద అవినీతి అరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇది ఆమె రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగులుతోంది. ఒక పక్క సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్, మంచి చరిష్మా, మంచి వాగ్దాటి ఉన్న విజతల రజనికి ఇటువంటి వివాదాల్లో ఇరుక్కోవడం కొంత ఇబ్బందికరమే అని చెప్పాలి. వీటి నుండి రజని ఎలా బయటపడతారో వేచి చూడాలి.