Jagan Bail Cancel petition: కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు..అన్న సామెత అందరికీ తెలుసు కదా. ఆ సామెత ఇప్పుడు అక్షరాలా రఘురామ కృష్ణం రాజుకు విషయంలో వర్తిస్తుంది అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు విషయం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. సీఎంగా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారనీ, సాక్షాలను ప్రభావితం చేస్తున్నారనీ, సహనిందితులకు ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని అందుకని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపి రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో రఘురామకు సీబీఐ సహకరిస్తుందని వైసీపీ, జగన్ వ్యతిరేకులు భావించారు.
Read More: Eatala Rajender: జ్వరంతో ఈటల అస్వస్థత..! పాదయాత్రకు బ్రేక్..!!
గతంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరిన సీబీఐ ఇప్పుడు రఘురామ పిటిషన్ సందర్భంలోనూ తమ వాదనలు వినిపిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సీబీఐ.. జగన్ బెయిల్ రద్దు చేయాలనీ గానీ, రద్దు చేయాల్సిన అవసరం లేదని కానీ, బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారు అని గానీ సీబీఐ కోర్టులో వాదనలు వినిపించడానికి ముందుకు రాకపోవడం రఘురామ వాదనలకు బలం లేకుండా పోయింది. ఒక వేళ సీబీఐ గతంలో పిటిషన్ దాఖలు చేసిన మాదిరిగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వాదనలు వినిపించి ఉంటే రఘురామ పిటిషన్ కు బలం చేకూరేది. మూడు పర్యాయాలు వాయిదా కోరుతూ వచ్చిన సీబీఐ చివరకు తాము లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సిద్ధంగా లేమని కోర్టుకు తేల్చి చెప్పేసింది. దీంతో వాదనలు ముగిసినట్లు పేర్కొన్న సీబీఐ కోర్టు తీర్పును ఆగస్టు 25న వెల్లడిస్తామని చెప్పింది.
రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సీబీఐ మొదటి నుండి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ వచ్చిందన్న విమర్శలు వచ్చాయి. వాస్తవానికి ఒక వేళ జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే పాయింటవుట్ చేయాల్సింది సీబీఐ. కానీ సీబీఐ ఇక్కడ సైలెంట్ గా ఉంది. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలివేసింది. ఈ పిటిషన్ విషయంలో జగన్ తరపు న్యాయవాదులు తొలి నుండి ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదనీ, రఘురామ కృష్ణంరాజు వ్యక్తిగత కక్షతో పిటిషన్ దాఖలు చేశారనీ కావున పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టుకు విన్నవిస్తూ వచ్చారు. కేసు నమోదు చేసిన సీబీఐయే బెయిల్ రద్దు విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పకపోవడం ఓ విధంగా రఘురామ కృష్ణం రాజుకు షాకింగ్ నిర్ణయమే. జగన్ కు గుడ్ న్యూస్ కిందే లెక్క. ఈ పరిణామాలతో సీబీఐ కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.