ఏపిలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు తదితర సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ కొన్నింటిని ప్రభుత్వం పరిష్కరించింది. పలు దఫాలు ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనను విరమించారు. అయితే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉందన్న టాక్ నడుస్తొంది. ఈ తరుణంలో ఉద్యోగులకు మంచి జరిగే నిర్ణయాలను తీసుకుంటోంది. రీసెంట్ గా ఏపి సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాల తరబడి పదోన్నతలకు నోటుకోని ఎంపీడీఓలకు జగన్ సర్కార్ పదోన్నతులు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 237 మంది ఎంపీడీఓలు పదోన్నతులు పొందారు. జడ్ పీ సీఇఓ, డిప్యూటి సీఇఓ, డ్వామా పీడీ., డీపీఓ తదితర పోస్టులకు పదోన్నతులు పొందారు. మరో పక్క ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ ఇన్సూరెన్స్ (ఈహెచ్ఎస్) స్కీమ్ పరిధిలోకి ఇప్పటి వరకూ లేని 565 వైద్య సేవలను నూతనంగా చేర్చడంతో పాటు వేరే రాష్ట్రాల్లోనూ వైద్య సేవలను పొందే సౌలభ్యం కల్పించింది. ఆరోగ్య శ్రీ స్కీమ్ పద్దతిలోనే 21 రోజుల్లో ఆటోడెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధానంతో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈహెచ్ఎస్ కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం వచ్చింది.
ఇప్పటి వరకూ అనేక వైద్య సేవలు ఈహెచ్ఎస్ పరిధిలో లేకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆ వైద్య సైవలకు ముందుగా ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి తరువాత రీయింబర్స్ మెంట్ కోసం బిల్స్ పెట్టుకుంటున్నారు. దీని వల్ల పూర్తి స్థాయిలో పెట్టిన ఖర్చు రాకుండా కొంత కోత విధిస్తుండటంతో నష్టపోతున్నారు. ఇప్పుడు దాదాపు 565 సేవలు చేర్చడం వల్ల నెట్ వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందే అవకాశం ఏర్పడుతోంది. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయం కోసం ఆరోగ్య మిత్రలకు విది విధానాలు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.