Jagan mohan reddy: ఏపిలో నిన్నటి వరకూ స్థానిక ఎన్నికల పంచాయతీ వ్యవహారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపి సీఎం వైఎస్ జగన్ అన్నట్లుగా సాగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఏకమై ఎన్నికలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంలో రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం పైచేయి సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పు నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఒక అడుగు వెనక్కు వేసినట్లే చెప్పుకోవాలి. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, కురసాల కన్నబాబు తదితరులు పేర్కొంటూనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై మరో సారి విరుచుకుపడ్డారు.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యనేతలు, అధికారులతో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించినట్లు సమాచారం. ఎస్ఈసీకి సహకరించడంపైనా కీలకం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాలను తప్పుబడుతూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగాన్ని విచ్చిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన వ్యాక్సినేషన్ అంశాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎన్నికలకు వ్యాక్సినేషన్ అడ్డంకి కానేకాదని అన్నది. ఉద్యోగ సంఘాలు చట్టవిరుద్దంగా వ్యవహారిస్తున్నారంటూ కోర్టు మండిపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో ఉద్యోగ సంఘాలు ఎంటర్ కావడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అక్షింతలు వేసింది.
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత ఎస్ఈసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించడం, సోమవారం నాటికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయకపోవడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయ్యింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాల్గవ దశగా మార్చింది. దీనికి కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 21న నాల్గవ దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఇక రెండు, మూడు, నాల్గవ విడత ఎన్నికలను ఒకటి, రెండు, మూడు దశలుగా మారుస్తూ వాటిని యథాతధంగా జరపనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మారిన షెడ్యుల్ ప్రకారం ఫిబ్రవరి ఏడున తొలి విడత ఎన్నిక, 13న రెండవ విడత, 17న మూడవ విడత, 21న నాల్గవ విడత ఎన్నికలు జరగనున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?