ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన పై గత కొద్దికాలంగా కొత్త కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజకీయంగా విమర్శలు శృతి మించుతున్నాయి. తాజాగా ఓ ఘటనపై ఇరు వర్గాలు స్పందించిన తీరు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రామతీర్థం దేవస్థానంలో జరిగిన ఆందోళనకర ఘటన గురించి రాజకీయ రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అంశం పై స్పందించిన మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇంకో నేత మంత్రి వెల్లంపల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబే చేయించారు…
రాజకీయాల కోసమే విజయనగరం జిల్లా రామతీర్థం లో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తారని కొడాలి నాని మండిపడ్డారు.
రామతీర్థంలో నూటికి నూరు శాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది చంద్రబాబేనని కొడాలి నాని ఆరోపించారు. రాజకీయాల్లో దేవుళ్ళను అడ్డంపెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారని అన్నారు. పదవుల కోసం గుళ్ళు, మసీదులు, చర్చిలు, తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఆయన. దేవుడులాంటి ఎన్టీఆర్ కే వెళ్లి పోటు పొడిచిన చంద్రబాబు కు, దేవుడు అన్న, ప్రజాస్వామ్యం అన్న నమ్మకం లేదని అన్నారు.
చంద్రబాబు , లోకేష్ , అశోక్ గజపతి రాజు…
భగవంతుడంటే నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రామతీర్థం ఘటనపై నీతి, నిజాయితీగా విచారణ చేసి దోషులను పట్టుకోవాలనీ ఆదేశాలు జారీ చేశారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. విచారణలో చంద్రబాబు దోషిగా ఉన్న, లేదా అతని తండ్రి ఖర్జూర నాయుడు ఉన్న, తాత కిస్మిస్ నాయుడు ఉన్న చర్యలు తీసుకుంటామని అన్నారు. చంద్రబాబుతో పాటు, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టిడిపి నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయని అన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవనీ చవట,దద్దమ్మ లోకేష్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ కి చాలెంజ్ విసరడం విడ్డూరం అని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళను కూల్చి, చెత్త ట్రాక్టర్లలో దేవుళ్ళ విగ్రహాలను డంపింగ్ యార్డ్ ల్లో పడేసిన చరిత్ర చంద్రబాబుదని, ఇప్పుడు కూడా చంద్రబాబు ఆధ్వర్యంలోని అతని అనుచరులు అధీనంలో ఉన్న గుళ్ళు, ఊరికి దూరంగా ఉన్న గుళ్ళలో దాడులు జరుగుతున్నాయని అన్నారు.
మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు
మరోవైపు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావుని ఉద్దేశించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ జెఎసి కన్వీనర్ గొట్టిముక్కల రఘరామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి సన్నాసి మంత్రిగా, దగుల్భాజీ మంత్రిగా అభివర్ణించాలని ఉన్నా… మాకు సంస్కారం అడ్డొస్తుందని ఆయన అన్నారు. అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నాయకుడిపై నోరు పారేసుకున్న ఆయన చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. వేల ఆలయాలు అభివృద్దికి, దూపదీప నైవేద్యాలకు ఆస్తులను దానం ఇచ్చిన కుటుంబం వారిదయితే ఆలయాల ఆస్తులను అమ్ముకుని దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర నీదని అన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబం దగ్గర కాపలా పనికి కూడా పనికిరావు అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. క్షత్రియ వంశంలో అశోక్ గజపతి రాజు విలువలతో బతికిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కాగా, జరిగిన ఘటనే అనేక మందిని బాదిస్తుంటే ఆ వివాదం కేంద్రంగా ఇలా అనుచిత కామెంట్లు రాజకీయ నాయకులంటే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?