Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహంపై మరోమారు చర్చ జరుగుతోంది.
ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు , హిందుత్వ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ విమర్శల పర్వంలో ఇరుకున పడుతున్న సీఎం జగన్ ఇదే సమయంలో విపక్షాలకు ఓ అస్త్రం స్వయంగా అందించారని టాక్ వస్తోంది. అదే ఏపీకి ప్రత్యేక హోదా!. ఆ అంశం కూడా ఏపీ సీఎం జగన్ సన్నిహితుల్లో ఒకరు తెరమీదకు తేవడం గమనార్హం.
ఏపీకి ప్రత్యేక హోదా …
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో శుక్రవారం పర్యటించారు. కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శి పంకజ్ తో పాటుగా వివిధ శాఖల మంత్రులు , అధికారులను కలిశారు. పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం పునరావాసం, పరిహారం అంశాలపై చర్చించానని, పూర్తిస్థాయిలో ప్రాజెక్టు ఖర్చును కేంద్రం రీయింబర్స్ చేయాలని కోరానని అన్నారు. పౌర విమానయాన శాఖ అధికారులను కలిశామని, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు విమానాశ్రయంలో కమర్షియల్ రాకపోకల పై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరానని అన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ని నిన్న కలిశానని, అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ గురించి చర్చించామని అన్నారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఉన్న విద్యుత్ పెండింగ్ అంశాలను కూడా కేంద్ర మంత్రితో చర్చించానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కేంద్ర బడ్జెట్ లో స్థానం కల్పించాలని, ఏపీ పునర్విభజన వల్ల నష్టం జరిగింది కాబట్టి రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతున్నామని బుగ్గన పేర్కొన్నారు.
బుగ్గన కెలికారా?
ఏపీకి ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. అయితే, ఇది రాజకీయ పార్టీల విమర్శలు – ప్రతి విమర్శలకు వేదికగా మారింది. మరోవైపు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీనే ఈ విషయంలో టార్గెట్ చేయబడుతోంది. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రయత్నం చేశారు కూడా! గత ఏడాది ఫిబ్రవరిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని జోక్యం అవసరముందని, లేకపోతే ఏపీ ప్రజలు దురదృష్టవంతులుగా మిగిలిపోతారని జగన్ అభిప్రాయపడ్డారు. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కునేందుకు ఏపీకి ఐదేళ్లపాటూ ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇప్పటి వరకు రాకపోవడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి సరైన న్యాయం జరుగకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఏపీకి చేయూత అందించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదని లేఖలో పేర్కొన్నారు.
ఇప్పుడైనా కేంద్రం కరుణిస్తుందా?
గత ఏడాది స్పందించినట్లే ఈ ఏడాది సైతం ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ తన ప్రయత్నం తాను చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన ప్రయత్నాలను కొందరు విశ్లేషిస్తుంటే మరికొందరు మాత్రం ప్రత్యేక హోదాను విపక్షాలు మరిచిపోయిన సమయంలో మళ్లీ తెరమీదకు తేవడం ద్వారా జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిందని అంటున్నారు.