ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ హిందు దేవాలయాల్లో జరుగుతున్న అవాంచనీయ ఘటనలు. దేవాలయల్లోని ఘటనలు అనేకమందిని తీవ్రంగా భాదిస్తుండగా మరోవైపు ఈ అంశం కేంద్రంగా మత రాజకీయాలు జరగడం కలకలం సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎపిసోడ్లో ఇరుకున పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ , ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ జగన్ సర్కారును ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నాయి. అయితే సీఎం జగన్ మాత్రం ఓ సంచలన నిర్ణయంపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
ఎన్నికల హామీ దిశగా…
ఏపీలో విపక్షాలు వివిధ అంశాలపై రచ్చ చేస్తున్నప్పటికీ సీఎం జగన్ తన ఎన్నికల హామీలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటువైపు వేగంగా కదులుతున్నారు.
లోక్సభ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా కొత్త జిల్లాల ఏర్పాటు అనే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఈ ప్రక్రియలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
ఇదే కొత్త జిల్లాలు…
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటికే జిల్లాలు ఖరారు అయ్యాయి. ఒక్క అరకు మినహా మిగతా వాటిలో పెద్దగా మార్పులు లేవంటున్నారు. అరకు-1, అరకు-2, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, కడప, నంద్యాల, రాజంపేట, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హిందూపురం జిల్లాలు ఏర్పాటు అవుతాయి. అరకు లోక్సభ నియోజకవర్గంలో పాడేరు, పార్వతీపురం కేంద్రంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అధికారుల కమిటీ సూచించిందని సమాచారం. అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలను విభజించి 2 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదించారని తెలుస్తోంది.