YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తన ఎత్తుగడలతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.
అనేక ప్రక్రియలు, ఉత్కంఠల తర్వాత ఎన్నికలకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన ఆయన వీడియో కాన్ఫరెన్స్లు, సమీక్షలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదే సమయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా సీఎం కార్యాలయం టార్గెట్ గా లేఖలు రాస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రాయలసీమలో టూర్ పెట్టుకున్నారు. ఈ చర్యలన్నీ చర్చనీయాంశంగా మారుతున్న ఇంకో ప్రణాళికను అమలు చేయనున్నారు.
సీమలో ఎంట్రీ … కడప పై ఫోకస్
అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దూకుడుగా స్పందిస్తోంది. ఏకగ్రీవాలపై ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు కూడా అందడంతో స్వయంగా నిమ్మగడ్డ రంగంలోకి దిగారు. ఓ అధికారిని ప్రత్యేంగా నియమించారు. అంతేకాకుండా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానున్న సమయంలో రాయలసీమ జిల్లాల పర్యటన పెట్టుకున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. రెండు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.ముందుగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన అనంతరం కడప జిల్లాల్లో పర్యటనకు వెళ్లనున్నారు. ఆయా జిల్లాల్లో అధికారులతో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించనున్నారు.
జగన్ టీం తేరుకునేలోగానే..
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా దూకుడు పెంచేయడమే కాకుండా ఏకంగా జగన్ సన్నిహితులు అనే పేరున్న అధికారులు , మంత్రులు , ఎంపీ పై ఫిర్యాదు చేశారు. దీనికి ఎలా కౌంటర్ ఇవ్వాలని అధికార వైసీపీ కసరత్తు చేస్తున్న సమయంలో ఇంకో ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఎస్ఈసీ. అదే ఉత్తరాంధ్రలో టూర్. రాయలసీమలో పర్యటన పూర్తవగానే ఉత్తరాంధ్రకు వెళ్లనున్న రమేశ్ కుమార్ అక్కడ సైతం ఏకగ్రీవాలపై ఓ కన్నేస్తారని అంటున్నారు.