Jagananna colonies: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో సదుద్దేశంతో ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేయాలన్న ఆకాంక్షతో ఏర్పాటు చేసిన జగనన్న ఇళ్ల నిర్మాణ పథకం నేడు విమర్శలకు దారి తీస్తున్నది. ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశం మంచిదే, ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇళ్లు కట్టించాలి అనుకున్నారు. కానీ ప్రాక్టికల్ గా వచ్చే సరికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు మూడు రకాల స్కీమ్ లను అనౌన్స్ చేశారు. అందులో ఒకటవది సొంతంగా కట్టుకునే స్థోమత లేని వారికి ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడం. రెండవది లబ్దిదారుడే నిర్మించుకుంటే ప్రభుత్వం మెటీరియల్, నగదు అందజేయం. మూడవది సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా ఇవ్వడం.
తొలుత చాలా మంది లబ్దిదారులు ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలన్న ఆప్షన్ పెట్టుకుంటే అందరికీ ప్రభుత్వం కట్టించి ఇవ్వడం సాధ్యం కాదని భావించి కొంత మందిని లబ్దిదారులను ఒప్పించి వారే కట్టుకునే విధంగా ఆప్షన్ పై సంతకాలు తీసుకున్నారు. అయితే పట్టణ ప్రాంతంలో సెంటు స్థలంలో ఇల్లు నిర్మాణం అంటే ఎక్కువ మంది నిర్మాణాలు జరుపుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులకు టార్గెట్ ఇచ్చి లబ్దిదారులు త్వరితగతిన ఇలు నిర్మించుకునే విధంగా మోటివేట్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇల్లు నిర్మించుకోకుంటే ఇంటి పట్టా క్యాన్సిల్ అవుతుందంటూ కూడా బెదిరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే..
ఈ ఇళ్ల నిర్మాణాలపై ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేనే గళం విప్పడంతో కోరస్ గా సీపీఐ నారాయణ విమర్శలు అందుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే జగనన్న ఇళ్ల బెడ్ రూంలో పెద్ద మంచం కూడా పట్టదనీ, హాలులో సోభనం చేసుకుని, బెడ్ రూమ్ లో పడుకోవాల్సి వస్తుందని కామెంట్స్ చేశారు. బాత్ రూమ్ ను బయట నిర్మించి బెడ్ రూమ్ సైజు పెంచాల్సిన అవసరం ఉందని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు 17వేల జగనన్న కాలనీల నిర్మించాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం ..విడతల వారీగా శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే యమలీల సినిమాలోని “మా చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ” డైలాగ్ గుర్తుకు వస్తోందని రఘురామ సెటైర్ వేశారు.
అమృత్ ఫథకం ద్వారాగత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని రఘురామ ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో ఇంతకన్నా మెరుగైన సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇస్తేనే చాలా ప్రాంతాల్లో ఆ ఇళ్లలో ప్రజలు నివసించడం లేదని చెప్పుకొచ్చిన రఘురామ..ఇళ్లు నిర్మాణం బాగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అతి తక్కువ బడ్జెట్ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణ సామాగ్రితో ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాలు బలంగా ఉండకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికైనా బెడ్ రూమ్ వైశాల్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?