రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. వైసీపీ ప్రభుత్వం వద్దంటున్నా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈ తరుణంలో అందరి చూపు ఉత్తరాంధ్ర పైనే ఉంది. విశాఖను పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం అన్నది వైసీపీకి చాలా ముఖ్యం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిపాలనా రాజధానిగా ప్రకటించి కూడా ఆ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవశం చేసుకోలేకపోతే నెగిటివ్ ఇంప్యాక్ట్ వచ్చే అవకాశం ఉంది. విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్రలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు గత కొద్ది కాలంగా చెప్పుకొస్తున్నారు.
వైసీపీకి రాయలసీమ జిల్లాలో ఉన్నంత పట్టు ఉత్తరాంధ్ర జిల్లాలో లేదనే మాట వినిపిస్తోంది. విశాఖ లో ఇంతకు ముందు 2014 ఎన్నికల్లో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తల్లి విజయమ్మ పరాజయం పాలైయ్యారు. 2019 ఎన్నికల్లో విశాఖ పట్టణంలోని నాలుగు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ కోల్పోయింది. అదే విధంగా శ్రీకాకుళం ఎంపి స్థానం కూడా టీడీపీ వసమైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ నేతలు గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం దాదాపు ఖరారు అయినట్లే కనబడుతోంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ గతంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించినట్లైయితే 90 శాతం ఎన్నికల సంఘానికి అనుకూలంగానే ఉండవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తుందన్న కారణంతో పాటు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవని చెబుతుండటం వల్ల పది శాతం వీరి పక్షాన తీర్పు వచ్చే అవకాశం కూడా ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయం ఎలా ఉన్నా ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ చేసి ఉన్నందున వైసీపీకి ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్తరాంధ్ర స్థానిక పోరులో వైసీపీ మెజార్టీ స్థానాలు కైవశం చేసుకోకపోతే రాజధానికి మద్దతు లేదన్న భావన వస్తుంది. మూడు రాజధానులపై వైసీపీ నేతలు చెబుతున్న మాటలు తేలిపోతాయి. ఈ నేపథ్యంలో అక్కడ విజయం కోసం వైసీపీ నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. త్వరలో వైసీపీ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశాలు ఉండవచ్చని అనుకుంటున్నారు. ఈ బహిరంగ సభ ఎక్కడ నిర్వహిస్తారనేది వైసీపీ నేతలు ఇంత వరకూ వెల్లడించలేదు. కానీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో నిర్వహించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా హజరు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బహిరంగ సభ నిర్వహించడం, ఎన్నికల్లో వైసీపీ స్పీప్ చేస్తే ఎస్ఈసీ నిమ్మగడ్డకు పెద్ద షాక్ యే అవుతుంది.