పార్టీ అధినేతగా.. ముఖ్యమంత్రిగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.. పార్టీ పరంగా, పాలన పరంగా.. ప్రభుత్వ పరంగా ఏ కొత్త నిర్ణయమైనా అందులో చాలా లోతైన అంశాలు ఉంటాయి.. కచ్చితమైన రాజకీయ ఫలితం ఉంటుంది..! ఎటువంటి లాబీయింగులకు లొంగకుండా.. సూటిగా, స్పష్టంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమల్లోకి తెచ్చే వరకు జగన్ దానిపై దృష్టి పెడుతూనే ఉంటారు..! ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీలో అంతర్గత మార్పులు.. కొన్ని స్థానాల అభ్యర్థుల మార్పులు ఉంటాయని చెప్పకనే చెప్పారు.. అందుకే ఎక్కడికక్కడ ఎవర్ని మారుస్తారు..? ఎవర్ని ఉంచుతారు..? ఎవరిని పొగపెడతారు..? ఎక్కడ సెగ పెడతారు..!? అనే చర్చ జరుగుతూనే ఉంది.. ఇలాంటి చర్చలే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో కూడా లోతుగా ఉన్నాయి..
తమ్మినేని సీతారాం.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు.. నాలుగు దశాబ్దాల నుండి వివిధ హోదాల్లో, పార్టీల్లో ఎదిగి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.. రాజ్యాంగబద్ధమైన కీలక హోదా.., బీసీ నేత.. బలమైన వాగ్ధాటి.. విస్తృత పరిచయాలు.. అన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలే.. కానీ ఆయన ప్రత్యర్ధే ఆయనకు కలిసి రావడం లేదు..! రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా తమ్మినేనికి ప్రత్యర్థి కూడా సొంత మనిషే.. టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, తమ్మినేని సీతారాం దగ్గరి బంధువులు అన్న విషయం రాష్ట్రం మొత్తం తెలిసిన అంశమే.. అందుకే అక్కడ రాజకీయాలు “స్పెషల్” గా ఉంటాయి..!
* తమ్మినేని సీతారాం టీడీపీని ఘాటుగా విమర్శిస్తారు.. చంద్రబాబుని ఘోరంగా మాట్లాడతారు.. జగన్ ని ఆకాశానికెత్తుతారు.. టీడీపీ అంటేనే అసహ్యం అనేంతగా మాటల్లో వ్యక్తీకరిస్తారు.. కానీ తన సమీప ప్రత్యర్థిని మాత్రం ఏ నాడూ వ్యక్తిగత విమర్శల జోలికి.. గతంలో రవికుమార్ చేసిన తప్పుల జోలికి వెళ్ళరు గాక, వెళ్ళరు!
* సేమ్.. రవికుమార్ కూడా “రాష్ట్రంలో పాలనని విమర్శిస్తారు.., వైసీపీని తిడతారు.. జగన్ ని ఘాటుగా మాట్లాడతారు.. పోలీసులను, పాలనను, వైసీపీ నేతలను ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు.. కానీ తన ప్రత్యర్థి జోలికి మాత్రం వెళ్ళరు.
“రాజకీయమంటే ప్రత్యర్థితో వైరం తప్పదు.. ప్రత్యర్థి పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీలో వ్యక్తి అయినా సమ దూరంతో చూడాలి. కానీ ఆముదాలవలసలో మాత్రం అలా జరగడం లేదు అనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి.. కూన రవికుమార్ చాలా సార్లు హద్దులు దాటినప్పటికీ అతనిపై సీరియస్ చర్యలేమి లేవు.. ఓ సందర్భంలో అయితే ఆయన పరిమితిని దాటి ఓ అధికారిపై దాడికి వెళ్లారు.. ఆ కేసులో అతన్ని అరెస్టు చేయాలనీ పోలీసులు వెతికిం, వెతికి చివరికి కనిపించలేదు, పరారయ్యారు” అని నివేదిక ఇచ్చుకున్నారు. కానీ నాడు రవికుమార్ తన “అధికారిక అయినవారి ఇంట్లోనే” ఉన్నారని నియోజకవర్గంలో చర్చ జరిగింది..!
జగన్ నిఘా.. ప్రత్యామ్నాయంగా ఆయనే..!?
ఈ అంశాలన్నీ సీఎం జగన్ దృష్టిలో కూడా ఉన్నాయి. “ఉంటె నువ్వు. లేదా నేను.. ఇద్దరం ఒకటే” అనే రాజకీయంపై సీఎం దృష్టికి కూడా నిఘా వర్గాలు తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే తమ్మినేని లాంటి సీనియర్ నేతని, కీలక పదవిలో ఉన్న వ్యక్తిని అదుపు చేయడం కష్టం. అలా అని అలా వదిలేయలేరు కూడా..! సో.., ప్రస్తుతానికైతే ఆ నియోజకవర్గంలో అంశాలని పార్టీ పెద్దలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి తమ్మినేని వారసుడు సిద్ధమవుతున్నారు.. సరిగ్గా ఇదే సమయంలో సీటుకి పోటీలో పొందూరు మండలానికి చెందిన కీలక నేత సువ్వారి గాంధీ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఈయన 2019లోనే టికెట్ ఆశించారు. చాలా ప్రయత్నాలు చేశారు.. కానీ తమ్మినేనిని కాదని జగన్ ఇటు మొగ్గు చూపలేకపోయారు. సో.., ఇదే అదనుగా వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి గాంధీ అంతర్గత ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల నిర్వహించిన జన్మదిన వేడుకలు కూడా భారీగా సాగాయి. ఓ కీలక నామినేటెడ్ పదవితో.. పార్టీలో పెద్దల దగ్గర మంచి పేరు.. తగిన అర్ధ, అంగబలం ఉండడంతో సువ్వారి ఈసారి ఎలాగైనా పోటీ చేసి తీరుతానని సంకేతాలు ఇస్తున్నారు.. మరోవైపు తమ్మినేని కూడా “తాను పోటీలో ఉంటానని.. లేనిపక్షంగా తన వారసుడు పోటీ చేస్తారని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు.. సో.. ఈ కీలక నియోజకవర్గ అంతర్గత వ్యవహారం వైసీపీలో కొన్ని నెలల్లోనే రచ్చెకెక్కేలా ఉంది..!