Jai Bhim Bharat: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. బడుగు బలహీన వర్గాలను కలుపుకుని ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొద్ది నెలల క్రితం సమావేశాలు నిర్వహించారు. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరో పక్క రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా నివారణకు ఉచితంగా మందు పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆనందయ్య కూడా బీసీల పార్టీల పెడుతున్నట్లు ప్రకటించారు. మీడియా సమావేశాల్లో వెల్లడించారు. ఆ సంఘ నేతలతో ఒకటి రెండు సార్లు సమావేశాలు నిర్వహించారు. కానీ ఈ పార్టీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే చాలా కాలంగా టీవీ టిబేట్ లలో పాల్గొనడంతో పాటు జై భమ్ యాక్సెస్ జస్టిస్ (జేఏజే) వ్యవస్థాపకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ను నిర్వహించారు. అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14న) రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని నెల రోజుల క్రితమే శ్రవణ్ కుమార్ చెప్పారు. చెప్పినట్లుగానే జై భీమ్ భారత్ పార్టీ ఆవిర్భావ సభ గురువారం విజయవాడలో నిర్వహించారు.
Jai Bhim Bharat: దళితుల కోసం పోరాడే పార్టీ లేదు
ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదన్నారు రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందన్నారు. తాను 28 సంవత్సరాలకే న్యాయమూర్తిని అయ్యాననీ, ఆ పదవిని పదేళ్లకే వదిలి వచ్చానని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తూ ఆయిల్ ప్యాకెట్ రూ.200లకు విక్రయించే పార్టీలను పొగుడుదామా అని ప్రశ్నించారు శ్రావణ్ కుమార్. దళిత బిడ్డలకు మేన మామ అని చెప్పిన సీఎం జగన్ .. ఆ తర్వాత చేసిన అన్యాయం ఎవరూ మర్చిపోరని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ
వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీ పెడతామని తెలిపారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తానని తెలిపారు. 26 రకాల దళిత స్కీమ్ లను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు శ్రావణ్ కుమార్. విదేశీ విద్య కోసం వెళ్లే వారు ప్రభుత్వం నుండి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కన్షీరామ్ మాటల స్పూర్తితో ఈ రాజకీయ పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రితో సబ్ ప్లాన్ పై ఎక్కడైనా చర్చిస్తానని సవాల్ విసిరారు. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు.