Badvel By Poll: జగన్మోహనరెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ప్రభుత్వపై పోరాటం సాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జగన్ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయానికి జై కొట్టారు. బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. దివంగత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నెల 1 వతేదీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా వైసీపీ తరపున దివంగత ఎమ్మేల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఓబులాపురం రాజశేఖర్ మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక బద్వేల్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ – జనసేన కూటమి తరుపున జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా? లేకా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారా? అనే విషయంపై సందిగ్దత కొనసాగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్.
Badvel By Poll: పోటీ నుండి ఎందుకు విరమించుకున్నారంటే.. పవన్ మాటల్లో..
“జనసేన పార్టీ రాజకీయ విలువతో ఉన్న పార్టీ. ఈ రోజు బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. బద్వేల్ బై పోల్ లో పోటీ చేయమని చాలా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పెద్దలందరితో కూర్చుని ఒకటే నిర్ణయించుకున్నాం. అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే సతీమణిని పోటీకి నిలుపుతున్నందుకు గౌరవంగా, వైసీపీతో భవిష్యత్తులో పోటీ చేస్తున్నప్పటికీ ఈ ఒక్క ఉప ఎన్నికల్లో మటుకు చనిపోయిన వారి సతీమణిని గౌరవిస్తూ ఎవరినీ అభ్యర్థిని నిలబెట్టకుండా వారినే పోటీ చేసుకుని ఏకగ్రీవం చేసుకుంటే మంచిదని తెలియజేస్తూ ఈ పోటీ నుండి ఉపసంహరించుకుంటున్నాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇక ‘సోము’ సారు నిర్ణయం ఏమిటో..?
బద్వేల్ ఉప ఎన్నికలో అభ్యర్థిని పోటీ నిలిపే విషయంపై తమ భాగస్వామ్య పార్టీ జనసేనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. అయితే జనసేన పోటీ చేయడం లేదని తెలియజేయడంతో బీజేపీ దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశం అవుతుంది. జనసేనతో చర్చించి నిర్ణయం తెలియజేస్తామని సోము వీర్రాజు అన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో చర్చించినట్లు గానీ, ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లుగా గానీ చెప్పలేదు. జనసేన నిర్ణయాన్నే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ అభ్యర్థి మద్దతుగా జనసేన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బద్వేల్ లో వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఒక వేళ టీడీపీ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.