జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తను పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గ కేంద్రంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు గడచిన రెండు వారాలుగా విజయవాడలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాన్ని ఈ సారి భీమవరంలో ఏర్పాటు చేశారు. విజయవాడ నుండి బీమవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ .. భీమవరంలో ప్రజల నుండి సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హజరవుతున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు చేరుకున్నారు.
జనవాణి కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయనీ, భీమవరంలోనూ ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. తాను ఇక్కడకు వచ్చిన సమయంలో డంపింగ్ యార్డ్ సమస్య ఏమైందని అడిగితే పరిష్కారం కాలేదనీ, ఇప్పటికీ అలానే ఉందని తెలిసిందన్నారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన నేతలు సమస్యల పరిష్కారానికి ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ గడచిన ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భీమవరంలోనూ పోటీ చేసి రెండు చోట్ల పరాజయం పాలైయ్యారు. భీమవరంలో వైసీపీ నుండి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ .. పవన్ కళ్యాణ్ పై 8వేల ఓట్లు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉండగా, టీడీపీ అభ్యర్ధి మూడవ స్థానంలో నిలిచారు.