Pawan Kalyan: రాష్ట్రంలో జనసేన – టీడీపీ పొత్తుపై చాలా రోజులుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాటే పడుతున్నారనీ వైసీపీ చాలా కాలం నుండి విమర్శిస్తూనే ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అన్నప్పటి నుండి టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమే అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వ్యూహాలను మార్చుకుంటుంటామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మరో పక్క బీజేపీ తాము జనసేనతో కలిసి ఎన్నికలకు వెళతామనీ, టీడీపీతో కలిసే అవకాశం లేదంటూ పేర్కొంటూ వస్తొంది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు బేటీ కావడంతో ఊహాగానాలు వచ్చాయి. అయితే విశాఖలో ప్రధాన మంత్రి మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ తరవాత పొత్తుల అంశంపై సందిగ్దత నెలకొంది.
మోడీతో భేటీ తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు. ఇటీవల చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి సమావేశం కావడంతో టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయంటూ మరో సారి మీడియాలో డిబేట్ లు సాగుతున్నాయి. అయితే ఇద్దరు నేతలు పొత్తుల పై చర్చించేందుకు ఇది సమయం కాదని ఆ అంశంపై మాట్లాడలేదు. అయితే ఇవేళ శ్రీకాకుళం రణస్థలంలో పవన్ కళ్యాణ్ పొత్తు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దం పాటు ఒంటరిగానే పోరాటం చేశానని, బలం సరిపోతుంది అనుకుంటే ఒంటరిగానైనా వెళ్లానన్నారు. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా అని పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. ఒంటరిగా పోరాటం చేసి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని అన్నారు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కొవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పేర్కొన్నారు. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళతామనీ, కుదరకపోతే ఒంటరిగానే వెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.