Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. బీజేపీతో కలిసి పని చేసే విషయంలో ఆ పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బీజేపీ అధిష్టానం ఒకలా, ఏపీ బీజేపీ మరోలా ఉండటంతో రాష్ట్రంలో బీజేపీ – జనసేన మద్య పొత్తు ఉన్నా లేనట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు ఇవ్వలేదంటూ ఓటమి పాలైన బీజేపీ అభ్యర్ధి మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక సందర్భంలోనూ, ఆ తర్వాత గానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం జనసేనతో సంప్రదింపులు జరిపిన దాఖలు లేవు. మద్దతు అడిగిందీ లేదు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభిమానులు ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై ప్రకటన చేయలేదు. దీంతో జనసేన అభిమాన పట్టభద్రుల ఓటర్లు వారికి ఇష్టమైన వారికి ఓటు వేశారు.
అయితే ఓటమి అనంతరం బీజేపీ అభ్యర్ధి .. జనసేన మద్దతు ఇవ్వలేదని పేర్కొనడం జరిగింది. దీంతో అసలు బీజేపీతో కలిసి పొత్తుతో ముందుకు వెళ్లడమా లేక తన దారి తను చూసుకోవడమా అనే దానిపై ఒక క్లారిటీ కోసం బీజేపీ పెద్దతో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. నిన్న బీజేపీ ఏపి వ్యవహారాల ఇన్ చార్జి మురళీధరన్ తో కీలక మంతనాలు జరిపారు. ఇవేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చల అధారంగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే తన ఎన్నికల ప్రచారానికి వారాహి వాహనాన్ని సిద్దం చేసుకున్న పవన్ కళ్యాణ్ ..జనాల్లోకి ఎప్పటి నుండి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
తెలుగు దేశం పార్టీతో జత కట్టే విషయంలో జనసేన, బీజేపీ మధ్య విరుద్దమైన అభిప్రాయాలు ఉండటంతో ఎలా ముందుకు వెళతారు అనేది మిలియన్ డాలర్ ల ప్రశ్నగా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉండగా, టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రశ్నలేదనీ, జనసేన పార్టీ పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది ఏపి బీజేపీ అభిప్రాయంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవేళ బీజేపీ అగ్రనేతలతో చర్చల అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. చూడాలి ఏమి జరుగుతుందో.. కాగా నిన్న రాత్రి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.