కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడివాడ రాగానే కొడాలి నానిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సినిమాలు చేస్తాం.. చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. సినిమాలు చేస్తూ రాజకీయాలు ఎలా చేస్తారు అని అడిగే వారిని “పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న మీరు రాజకీయాలు చేస్తే తప్పు లేనప్పుడు సినిమాలు చేస్తూ మేము ఎందుకు రాజకీయాలు చేయకూడదు” అని కార్యకర్తలు ప్రశ్నించాలని పవన్ పిలుపునిచ్చారు.
“సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపుకుంటూ మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేసుకుంటూ మేము ఎందుకు రాజకీయం చేయకూడదని ప్రశ్నించాలి. మైనింగ్, మీడియా సంస్థలు మీకు ఉండాలి. మేము మీకింద ఊడిగం చేయాలి. మీ మాటలు పడాలి. మీదాష్టీకంకు గురి అవ్వాలి. ఆ రోజులు పోయాయి. అవి గత రోజులు. ఎదురు తిరిగే రోజులు ఇవి. చొక్కా పట్టుకుంటే తిరిగి చొక్కా పట్టుకునే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి అందరూ” అంటూ పవన్ హెచ్చరించారు.
నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని పవన్ అన్నారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. గుడివాడలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు రహదారులను బాగు చేయాలని ఎమ్మెల్యేను నిలదీయాలని పిలుపునిచ్చారు.
నివర్ తుఫాను కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం పట్ల జనసేన నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ లను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన నేతలకు పవన్ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన పవన్ తరువాత మచిలీపట్నంలో పర్యటించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?