వరద బాధితులకు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజకు పెరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాలకు చెందిన ప్రజలు వరద నీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వేల మంది వరద బాధితులు ఉంటే నామమాత్రంగా పురనరావసా కేంద్రాలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే వరద పరిస్థితులపై వైసీపీకి ఏ మాత్రం అప్రమత్తం లేదని అర్ధం అవుతోందన్నారు. బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని విమర్శించారు. మానవత్వంతో స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరద బాధితుల గోడు పాలకులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవులు కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిందని విమర్శించారు.
రెండేళ్ల క్రితం వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చిన వారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రస్తుతం నీట మునిగిన ఇళ్లల్లో వరద బాధితులు బిక్కుబిక్కు మంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నారంటూ పాలనా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.