జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు లక్ష వంతున ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మండపేటలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత ఆర్ధిక స్వావలంబన సాధించేందుకు పది లక్షల రుణం ఇస్తామని ప్రకటించారు.అన్యాయం జరిగితే ప్రజలు ఎదురుతిరగాలని పవన్ పిలుపునిచ్చారు. శ్రీలంకలో బలమైన అధ్యక్ష కుటుంబం ప్రజల తిరుగుబాటుతో పరారయిన విషయాన్ని గుర్తు చేస్తూ జనం తిరగబడితే ఏ రాజకీయ నేత సరిపోడని అన్నారు. నాయకులకు టికెట్ ఇచ్చినా వారిని చూడకుండా వారిలో పవన్ కళ్యాణ్ ను ప్రజలు చూడాలన్నారు.
ఉభయ గోదావరి జిల్లా నుండి మార్పు మొదలయితే అది పులివెందుల వరకూ వెళుతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడేది జనసేన మాత్రమేనన్నారు. జనసేన పార్టీని ఎందులో విలీనం చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని అన్నారు. ఏపి భవిష్యత్తు కు వైసీపీ హనికరమని అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాలకే ఇస్తామని చెప్పారు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తెలంగాణలో నా తెలంగాణ అన్న ప్రాంతీయ భావన ఉందనీ, ఆంధ్ర లో మాత్రం కులాలను గౌరవిస్తారని అన్నారు. అంబేద్కర్ కూడా తొలి సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అన్నారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తమ పార్టీ స్వాగతించిందనీ, కానీ దానిని కూడా వైసీపీ కుల రాజకీయం చేసిందని విమర్శించారు. జాతీయ రాజకీయ నేతలకు కులాలు అంటగట్టకూడదని ఈ వేదికగా తీర్మానం చేసుకుందామన్నారు. అక్టోబర్ నుండి ప్రజల్లోకి వస్తాననీ, అప్పుడే తాము ఏమి చేయబోతున్నామో చెబుతామని అన్నారు పవన్ కళ్యాణ్. గోదావరి వరదలలో బాధితులను జనసైనికులు ఆదుకోవాలని పవన్ కోరారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు హెలికాఫ్టర్ లోనే ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వమే కావాలా.. జనసేన కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.
బ్రేకింగ్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ ఖడ్